పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి…ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి

కడప బ్యూరో ఏప్రిల్ :10: ఆర్ బి ఎన్ న్యూస్

ఒక్కో సిలెండర్ పై రూ 50 పెంపు…

పేద,సామాన్య జనం నడ్డి విరుస్తున్న ప్రభుత్వాలు…

గ్యాస్ సిలీండర్ రేట్లు పెంచడం అమానుషమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అన్నారు. సామాన్యుడి వంటింట్లో గ్యాస్ ధరలు మంటలు పుట్టిస్తున్నాయన్నారు. గత కొన్ని రోజులుగా వాణిజ్య సిలెండర్ ధరలను పెంచుతూ వస్తున్న ప్రభుత్వం తాజాగా గృహ వినియోగదారులకు వాత పెట్టిందన్నారు. వంట గ్యాస్ ధరను కేంద్రం రూ 50 పెంచి పేద,సామాన్య జనం నడ్డివిరిచిందన్నారు. ఉజ్వల్ యోజన పథకం క్రింద అందచేసే సిలెండర్ పై కూడా రూ 50 భారాన్ని మోపారాన్నారు.సామాన్య, మధ్య తరగతి ప్రజలకు గ్యాస్ ధరలు భారం అవుతున్నాయని.14.2 కేజీల ఎల్ పి జి గ్యాస్ సిలెండర్ ధర రూ 853 నుంచి రూ 903కు చేరిందన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్టు సిలెండర్ రేటు పెంచడం భారంగా మారిందన్నారు. కూరగాయల ధరల నుంచి కిరాణా సరుకుల వరకు ధరలు పెరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌లో భాగంగా ప్రవేశపెట్టిన దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్లు చాలామందికి అందడం లేదన్నారు.ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించారని, ముందుగా వినియోగదారులు సిలిండర్‌ ధర ఏజెన్సీలకు చెల్లించాలని, రెండు రోజుల్లో ఆ డబ్బులు మొత్తం సబ్సిడీ కింద వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారన్నారు.ఈ మేరకు తొలివిడత కింద ఇప్పటివరకూ ముప్పై, నలభై శాతం మందికి సిలిండర్‌ రాయితీ డబ్బులు వారి ఖాతాకు జమ కాలేదన్నారు.తొలి సిలిండర్‌ సరఫరాకు మార్చి 31 న గడువు ముగిసిందని,ఏప్రిల్ 1 నుంచి రెండవ సిలెండర్ పంపిణీ పక్రియ మొదలైందన్నారు. మొదటి సిలిండర్‌ సబ్సిడీ తమకు వర్తిస్తుందో లేదోనని మిగిలిన గ్యాస్‌ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి కోరారు.దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ,డీజిల్ రేట్లు మన రాష్ట్రంలోనే అధికంగా ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ 109.22, కర్ణాటక లో లీటర్ పెట్రోల్ ధర 102.92, తమిళనాడు లో లీటర్ పెట్రోల్ ధర రూ 101.84 ఉందన్నారు. పొరుగు రాష్ట్రాలలో మనకంటే తక్కువ రేట్లు వున్నాయన్నారు.అన్ని రాష్ట్రాల కన్నా డీజిల్,పెట్రోల్ ధరలు రూ 10 తగ్గి ఉండేలా చేస్తామని కూటమి పెద్దలు ఎన్నికల సమయంలో చెప్పారని, ఆ మేరకు కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :